నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్24(నమస్తే తెలంగాణ) : ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించండి. 10-12 ఎంపీ సీట్లు గెలిస్తే భూమి.. ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేద్దాం. నేను హామీ ఇస్తున్నా. మీరిచ్చే బలమే కేసీఆర్ బలం. ప్రభుత్వం మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ పోరాటంతోనే రాష్ర్టానికి మంచి జరుగతది’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నాటి నుంచి నేటి వరకు మనకు కాంగ్రెస్ పార్టీనే శత్రువు… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది… సాగర్కు నీళ్ల కరువు వచ్చింది అని తెలిపారు. నల్లగొండకు చెందిన చేతగాని దద్దమ్మలు మంత్రులుగా ఉన్నారని జిల్లా నుంచి నీళ్ల మంత్రి ఉండగా సాగర్ కట్టను కేఆర్ఎంబీకి అప్పజెప్పారని తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనం నీరాజనం పట్టారు. అడుగడుగునా స్వాగతం పలుకుతూ తమ సమస్యలను ఎకరువు పెడుతూ కేసీఆర్ చెప్పే మాటలు వినేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. మిర్యాలగూడ పట్టణంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ రోడ్షోలో పాల్గొని కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం తాను పాదయాత్రలో భాగంగా కోదాడ నుంచి మిర్యాలగూడకు వచ్చానని గుర్తు చేశారు. ఆనాడు కూడా సాగర్ కాల్వకు నీళ్లు ఇవ్వకుంటే పోరుబాట చేస్తే అక్కున చేర్చుకున్నారని చెప్పారు.
తెలంగాణకు బతుకే నీరంటూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగర్ జలాశయంలో నీరు లేకున్నా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను కాపాడినట్లు వివరించారు. కానీ నేడు పొలాలను ఎండబెట్టి రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు ఎడమ కాల్వకు 18 పంటలకు నీరిస్తే రైతులు బంగారు పంటలు పండించారన్నారు. నీళ్లు, కరెంటు, రైతుబంధు ఇవ్వలేక జిల్లా మంత్రులు తనను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. తాను వస్తుంటే ఆర్జాలబావి వద్ద రైతులు ఎదురేగి ధాన్యం కొంటలేరని చెప్పారన్నారు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువైతే… కాళేశ్వరం నుంచి మూసీ నదిలో వదిలి అక్కడి నుంచి ఉదయసముద్రం నుంచి పెద్దదేవులపల్లికి వదిలి శాశ్వతంగా నీటిని అందించాలని కూడా తాము ఆలోచించామని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్కు కీలకం అంటూ బంగారు తెలంగాణ అయ్యేదాకా కొట్లాడాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలువాలన్నారు. నల్లగొండలో కారు గుర్తుపై ఓటు వేసి కంచర్ల కృష్ణారెడ్డి బ్రహాండమైన మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత గెలుపుతోనే రానున్న కాలంలో ప్రభుత్వం మెడలు వచ్చేందుకు సిద్ధం కావాలని ప్రజలను కోరారు.
కేసీఆర్ బస్సుయాత్రకు జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. చౌటుప్పల్ నుంచి మిర్యాలగూడ వరకు, అటు నుంచి సూర్యాపేట వరకు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు, జనం ఆసక్తితో బస్సుయాత్రను గమనించారు. చేతులు ఊపుతూ స్వాగతించారు. కేసీఆర్ కూడా ప్రతిగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అన్నెపర్తి వద్దకు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్న రైతులు బస్సురాగానే ఎదురెళ్లారు. రైతులను చూసి కేసీఆర్ బస్సును ఆపి వాళ్లతో ముచ్చటించారు. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులను అడుగుతూ పంటలు పండినయా… కరెంటు ఎట్లుంటున్నది.. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని ఆరా తీశారు. బోనస్ గురించి కొట్లాడాలని రైతులు కోరగా, కొట్లాడుదాం అని అభయమిచ్చారు. ఆర్జాలబావి వద్ద కూడా రైతులు, హమాలీలు పెద్ద సంఖ్యలో కేసీఆర్ బస్సుకు ఎదురొచ్చారు. దాంతో బస్సు దిగి వారితో మాట్లాడారు. 20రోజులైనా ధ్యానం కొంటలేరని తమ ఇబ్బందులను కేసీఆర్తో రైతులు ఏకరువు పెట్టారు. ‘మీ పాలనే బాగుంది… మళ్లీ మీరే రావాలి’ అంటూ రైతులు కేసీఆర్ను దీవించారు. అనంతరం మిర్యాలగూడ రోడ్షో ముగించుకుని కేసీఆర్ సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో తిప్పర్తి వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీగా జనం ఎదురుచూడడం కనిపించింది. దాంతో కేసీఆర్ అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నకిరేకల్ పట్టణం చీమలగడ్డ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు.
మిర్యాలగూడ, సూర్యాపేటల్లో జరిగిన కేసీఆర్ రోడ్షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అంచనాకు మించి జనం తరలిరావడంతో రెండు చోట్ల జన ప్రభంజనంలా మారింది. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో జనం భారీగా తరలివచ్చారు. ఎటుచూసినా కిక్కిరిసిన జనంతో పట్టణాలు గులాబీమయంగా మారాయి. మిర్యాలగూడలో 2 కిలోమీటర్ల మేర జనం కేసీఆర్ బస్సు వెంట పరుగులు తీస్తూ ప్రసంగం విన్నారు. ముఖ్యంగా యువత, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తమ అభిమాన నేత కోసం తరలిరావడం విశేషం. కేసీఆర్ బస్సుపై పూలవర్షం కురిపిస్తూ చేతులు ఊపుతూ…. ఈలలు వేస్తూ… కేరింతలు, చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక కేసీఆర్ పదునైన ప్రసంగానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తమ ప్రాంతానికి కేసీఆర్ వస్తుండడంతో మధ్యాహ్నం నుంచి మిర్యాలగూడకు జనం తండోపతండాలుగా తరలిరావడం కనిపించింది. దారిపొడవునా ఎడతెగని జనప్రవాహం కొనసాగడంతో 2 కిలోమీటర్ల రోడ్షోకు 40నిమిషాల సమయం తీసుకుకోవడం విశేషం. బస్సుయాత్రలో దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర నేతలు ఇస్లావత్ రాంచందర్నాయక్, నల్లమోతు సిద్దార్ధ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.