హనుమకొండ చౌరస్తా, జూలై 10 : వరంగల్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘నాలెడ్జ్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్ జాయింట్లీ విత్ విజువలైజేషన్ ఫర్ రియల్-వరల్డ్ అప్లికేషన్స్ (కాసి-జేవీఆర్ 2026)’ అంతర్జాతీయ సదస్సు శుక్రవారం రామన్హాల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్, సెయింట్ ఆగస్టిన్కు చెందిన ప్రొఫెసర్ అండ్ హెడ్ ప్రొఫెసర్ శ్రీధరరావు గుణకల ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.
ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన ప్రొఫెసర్ పి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ సన్యాసిరాజు వై.వి.ఎస్.ఎస్. అతిథులుగా పాల్గొన్నారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.ఉమామహేశ్, ఛైర్మన్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసాచార్య కాసి-జేవీఆర్ 2026 లక్ష్యాలను వివరించి, శాస్త్రీయ కంప్యూటింగ్, గణిత నమూనాలు, విజువలైజేషన్ రంగాల్లో సహకార పరిశోధనల అవసరాన్ని వివరించారు. ప్రొఫెసర్ ఎన్.వి. ఉమామహేశ్ శాస్త్రీయ కంప్యూటింగ్, విజువలైజేషన్ వంటి సమకాలీన అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించిన గణితశాస్త్ర విభాగాన్ని అభినందించారు.
ప్రొఫెసర్ కాశీ విశ్వనాథం, ప్రొఫెసర్ రమణమూర్తిలు విద్యారంగానికి, గణితశాస్త్ర విభాగానికి నిట్కు అందించిన విశేష సేవలను కొనియాడారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ రామ్రెడ్డి, ప్రొఫెసర్ కె.కళాధర్, ప్రొఫెసర్ జె. శ్రీనివాస్ సంయుక్త నిర్వాహక కార్యదర్శులుగా వ్యవహరించారు. శాస్త్రీయ కంప్యూటింగ్, సంఖ్యాత్మక పద్ధతులు, గణిత నమూనాలు, విజువలైజేషన్, అంతరశాఖ అనువర్తనాలపై తాజా పరిశోధనలను ఇందులో చర్చించారు. భారత్తో పాటు విదేశాల నుంచి ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య పరస్పర విజ్ఞాన మార్పిడి ద్వారా శాస్త్రీయ కంప్యూటింగ్, విజువలైజేషన్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సహకార పరిశోధనలకు ఈ సదస్సు దోహదపడనుంది.