హైదరాబాద్ : తెలంగాణలో రాజ్యాంగానికి అవహేళన జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా దురహంకారంతో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేసిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఖ్యా బలం లేకున్నా మంత్రి వివేక్ ఆయన కుమారుడు అధికారులను బ్లాక్ మెయిల్ చేసి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ అంతా ఢీల్లీలో కూర్చుంది. ఢిల్లీలో దేని మీద సమీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి పంపుతున్న లెక్కలపై సమీక్ష చేస్తున్నారా? కేరళ ఎన్నికల లెక్కలపై సమీక్ష చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఆయన వెంట క్యామ మల్లేష్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.