హనుమకొండ చౌరస్తా, మార్చి 16 : క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడం సాధ్యమని క్షయ వ్యాధిలేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు అన్నారు. మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచనల మేరకు శుక్రవారం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ క్షయ వ్యాధి వచ్చినపుడు రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, తెమడలో రక్తం పడటం లాంటి లక్షణాలతో క్షయవ్యాధిగా గుర్తించి మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలలో తేమడ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని నిర్ధారించుకోవచ్చన్నారు. డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా పూర్తి కాలపరిమితి కోర్సు వాడాలని మధ్యలో ఆపినట్లైతే వ్యాధి ముదిరి ప్రాణాంతక టీబీగా మారి ప్రాణం కూడా కోల్పోవచ్చాన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ దగ్గు వచ్చినపుడు చేతి రుమాలు వాడడం, మాస్కల్ ధరించడం వలన ఒకరి నుంచి మరొకరికి రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.
టీబీ పేషెంట్కి మందులు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందని, రోగికి నెలకు వెయ్యి రూపాయలు, ఆరు నెలల పాటు వారి పోషకాహారం కోసం నేరుగా వారి ఖాతాలో జమచేస్తుందని తెలిపారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్, టీచింగ్ స్టాఫ్ రోహిణి, పద్మ, జిల్లా క్షయ వ్యాధి టీబి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు వి.సుష్మా, పి.కిరణ్కుమార్, డి.నగేష్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టి.విజయ్, సతీష్, హెల్త్ విజిటర్స్సునీత పాల్గొన్నారు.