ధర్మారం/రామడుగు/మల్యాల/మెట్పల్లి రూరల్, ఆగస్టు 2 : ఎస్సారెస్పీ పున రుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్తోపాటు, పునర్జీవ పథకం ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్, మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్హౌస్లో ఆదివారం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నంది పంప్హౌస్లో ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెకుల చొప్పున మొత్తం ఐదు పంపుల ద్వారా 15,750 క్యూసెకుల ప్రవాహంతో నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి అదే జంట సొరంగాల ద్వారా గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు.
అక్కడి 1, 2, 3, 4, 7వ మోటర్లతో ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 15,750 క్యూసెక్కుల ప్రవాహంతో ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా వరద కాలువకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వరద కాలువ ద్వారా ఎడమ వైపు శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) జలాశయానికి 9,950 క్యూసెక్కులు, పునర్జీవ పథకం ద్వారా కుడివైపు రాంపూర్ పంప్హౌస్కు 5,800 క్యూసెక్కుల ప్రవాహంతో పంపిస్తున్నారు. అక్కడ నాలుగు మోటర్ల ద్వారా అంతే మొత్తంలో ఎత్తిపోస్తుండగా, రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34వ కిలోమీటర్) వద్ద నిర్మించిన పంప్హౌస్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడ మూడు పంపులు ఆన్చేసి ఒక్కో పంప్ ద్వారా 1,450 క్యూసెక్కుల చొప్పున 4,350 క్యూసెక్కుల ప్రవాహంతో ఎగువకు ఎత్తిపోస్తున్నారు.