Job Calender | క్యాలెండర్లు మారాయి. కానీ కొలువులు మాత్రం రాలేదు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తానన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు రెండేండ్లు పూర్తయినా.. నోటిమాటకైనా నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్ని భర్తీ చేస్తూ.. వాటినే తన ఖాతాలో వేసుకుని కాలం వెళ్లదీస్తున్నది. కాంగ్రెస్ నయవంచనపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. నోటిఫికేషన్లపై మాట తప్పిన సర్కార్ మీద జెన్జీ జంగ్కు సిద్ధమవుతున్నది.
హామీ ఇచ్చినట్టుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నం. దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించినం. నిరుద్యోగుల విషయంలో ఇదీ మా చిత్తశుద్ధి!
-2024 ఆగస్టు 2న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఏటా జాబ్ క్యాలెండర్.. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. నాలుగువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇదీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించింది. జాబ్ క్యాలెండర్ జాడ లేదు. నిరుద్యోగ భృతి ఊసులేదు. ‘ఇదిగో మా నిబద్ధత..’ అంటూ 2024 ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. 15 రకాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఈ క్యాలెండర్ గడువు కూడా ముగిసింది. కానీ, అందులో పేర్కొన్న ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. 2025 ఆగస్టు 2, శనివారంతో 2026 ఆగస్టు 2 కూడా గడిచిపోయింది. రెండేండ్ల గడువు పూర్తయ్యింది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు కూడా పూచికపుల్ల విలువ ఇవ్వడం లేదని జెన్జీ తరం నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే తాము ఉద్యమించకతప్పదని జెన్జీ నిరుద్యోగ యువత హెచ్చరిస్తున్నది.
నిరుద్యోగ యువతను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. దీనిని ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం పొందుపరిచింది. కానీ, డిక్లరేషన్లో ప్రకటించిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఉద్యోగాలొచ్చే వరకు యువతకు నెలకు రూ. 4వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు పైసలు కూడా ఇవ్వలేదు. అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనేలేదు. ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అటకెక్కించింది. ఆఖరుకు ఏడాదిలో ఒకసారే ఫీజు వసూలు చేస్తామని చెప్పి.. టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు రూ.వెయ్యి, రూ.రెండువేల ఫీజులు వసూలు చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఏటా దాదాపు 9వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరితోపాటు విద్యుత్తు సంస్థలు, పలు బోర్డులు, విభాగాల్లోనూ పెద్దఎత్తున ఉద్యోగ విరమణ పొందుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం పాఠశాల విద్యాశాఖలో 14వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీల్లో 2వేలకుపైగా బోధన, మరో 2,800 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురుకులాల్లో ఆరువేలు, ఆర్టీసీలో మూడువేలకుపైగా, పోలీసుశాఖలో 17వేలకుపైగా ఖాళీలున్నాయి. ఎక్సైజ్ శాఖలో వెయ్యి, అంగన్వాడీల్లో 15వేలకుపైగా, మైనారిటీ సంక్షేమ శాఖలో మూడువేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా పలు శాఖల్లో పెద్దఎత్తున ఖాళీలున్నా సర్కార్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. ఉద్యోగాలు భర్తీచేయడం లేదు.
ప్రభుత్వ శాఖల్లో రిటైర్మెంట్ అయిన వారినే సర్కార్ కొనసాగిస్తున్నది. కన్సల్టెంట్లు, కాంట్రాక్ట్ పేర వేలకు వేలు జీతాలిచ్చి తీసుకుంటున్నది. అలా రిటైర్మెంట్ కాగానే వారిని మళ్లీ ఏదో ఒక పేరిట తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. మూడు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులుంటే అంతే స్థాయిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 66 వేల మంది, ఔట్సోర్సింగ్ కింద 1.14 లక్షలు, మల్టీపర్సర్ వర్కర్లుగా 53 వేలు, రోజు వారీ వేతనం పొందేవారు 9వేల మంది, గౌరవ వేతనం పొందుతున్న వారు 2.29 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదు.
70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీచేశామని, ఉద్యోగాల భర్తీలో తమదే రికార్డు అని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మాటలన్నీ ఉత్తదేనని అసెంబ్లీలోనే తేలిపోయింది. 2026 మార్చి వరకు 16,978 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశామని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ గణాంకాలు బయటపెట్టింది. తాము భర్తీ చేశామని చెప్పుకుంటున్న వాటిలో 50,785 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినవేనని అసెంబ్లీలో సమాధానమిచ్చింది.
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండేండ్లు పూర్తయినా, నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ‘ఇస్తానన్న ఉద్యోగాలేవి? జాబ్ క్యాలెండర్ అమలెక్కడ? ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? ఇంకెన్నాళ్లు కోచింగ్లు తీసుకోవాలి?’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ఉద్యోగాల భర్తీ కోసం తాము కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం కారణంగా తమ భవిష్యత్తు నాశమవుతున్నదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక ఊరుకోబోమని, ఢిల్లీ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
క్యాలెండర్లు మారాయి కానీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 70వేల ఉద్యోగాలు ఇచ్చిందనే మాట అబద్ధం. ఏండ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడ లేదు. క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ, నిరుద్యోగుల బతుకులు మారడంలేదు. ఇప్పటివరకు 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. శనివారం మరో నిరుద్యోగి ప్రాణాలు వదిలాడు. ఇందుకోసమేనా రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది? నిరుద్యోగంలో తెలంగాణ రైజింగ్ అని సర్వేలు చెప్తున్నాయి. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ విఫలమైంది.
– అస్మా, నిరుద్యోగ జేఏసీ నాయకురాలు, పీహెచ్డీ స్కాలర్ హెచ్సీయూ
30 లక్షల మంది నిరుద్యోగులు తలా మూడు ఓట్లు వేయిస్తే, 90 లక్షల ఓట్లు, 90 సీట్లు వస్తాయని మమ్మల్ని రేవంత్రెడ్డి రెచ్చగొట్టారు. మేం అందరి కాళ్లు పట్టుకొని ఓట్లు వేయిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులకు పదవులొచ్చాయి.. తప్ప మాకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. పైగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్లు, పోలీసు దమనకాండలు కొనసాగుతున్నాయి. అప్లికేషన్ ఫీజులు రూపాయి తీసుకోబోమని చెప్పి, ఇప్పుడేమో ఫీజులు రెట్టింపు పెంచి మా రక్తమాంసాలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ఢిల్లీ తరహా జెన్జీ ఉద్యమం తప్పదు. ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలవంచక తప్పదు.
– ఆకాశ్, నిరుద్యోగ జేఏసీ నేత
నోటిఫికేషన్ పేరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన తేదీ