హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : యువతకు ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ స్కిల్స్, ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ‘ఉడాన్’ ప్రోగ్రామ్లో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), డెల్ టెక్నాలజీస్ మధ్య ఎంవోయూ కుదిరింది. శనివారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో టాస్క్, డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలు అందించనున్నామని వివరించారు. డెల్ టెక్నాలజీస్ సాంకేతికత మద్దతు, ఐఐటీ ఢిల్లీ అభివృద్ధి చేసిన సిలబస్తో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ రామ్, టాస్క్ సీఈవో నితిన్ కుమార్రెడ్డి, సీవోవో రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.