ముంబై: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబేలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు క్యాంపస్లో భారీ నిరసనకు దిగడంతో యాజమాన్యం ప్రస్తుతం జరుగుతున్న మిడ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండవ సంవత్సరం విద్యార్థి శుక్రవారం జరిగిన మిడ్ సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ప్రశ్న పత్రానికి సంబంధించిన సమాధానాల కోసం మొబైల్ ఫోనులో చాట్జీపీటీ ద్వారా సమాధానం వెదుకుతూ, ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డాడు. అయితే అతనిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సంబంధిత విభాగాధిపతి(హెచ్వోడీ) ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం పరీక్ష ముగిసిన తర్వాత ఆ విద్యార్థి హాస్టల్-4లోని తన గదికి వెళ్లి, రాత్రి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోవై పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజావాడి దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది.