హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం వరకు ప్రాణహిత నుంచి 5.66 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి అది 5.52 లక్షల క్యూసెక్కుల వద్ద కొనసాగుతున్నది. సీతమ్మసాగర్ వద్ద 15.25 లక్షల ప్రవాహం కొనసాగగా, ప్రస్తుతం అది 9 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది. వెరసి భద్రాచలం వద్ద వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఎగువ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా దిగువకు జలాలను వదిలేస్తున్నారు. శనివారం సాయంత్రం జూరాలకు 1.78 లక్ష క్యూసెక్కులు వరద రాగా, ప్రస్తుతం అది 1.56 లక్షలకు తగ్గిపోయింది. ఇక్కడ 27గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు 1.28 లక్షల క్యూసెక్కుల నుంచి 1.69 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నుంచి రాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు ఆదివారం ఇన్ఫ్లో 5,52,600 క్యూసెక్కులుగా ఉన్నది.
దేవాదులలో ఎనిమిది మోటర్లతో పంపింగ్ ; రోజుకు 2129 క్యూసెక్కులు ఎత్తిపోత
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు మోటర్లతో గోదావరి జలాల పంపింగ్ కొనసాగుతుండగా ఆదివారం మరో ఐదు మోటర్లను ఆన్ చేశారు. ఫేజ్-1లో ఒకటి, ఫేజ్-2లో రెండు, ఫేజ్-3లో ఐదుతో కలిపి మొత్తం ఎనిమిది మోటర్ల ద్వారా రోజుకు 2,129 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. గోదావరి జలాలను దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా భీంఘనపురం రిజర్వాయర్లోకి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తుపాకులగూడెంలోని సమ్మక్క బరాజ్ వద్ద గోదావరిలో వరద ప్రవాహం తగ్గుతున్నది. ఎగువ నుంచి బరాజ్లోకి 5,67,900 క్యూసెక్కుల వరద వస్తుండటంతో మొత్తం 59 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి బరాజ్ వద్ద 80.8 మీటర్ల నీటిమట్టం ఉన్నదని అధికారులు తెలిపారు.
గోదావరి బేసిన్.. కృష్ణా బేసిన్
