Warangal | వరంగల్ చౌరస్తా: ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను సవరించి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడీదారులకు అనుకూలంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను తగ్గించి ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని మరోవైపు ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు సబ్సిడీలు రాయితీలు కల్పించారని అన్నారు. బడ్జెట్ రాబట్టడానికి ప్రజలపై భారాలు వేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆహార భద్రతకు నిధులు తగ్గించి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పంటల మద్దతు ధర కల్పించేందుకు, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ను సవరించి దేశ ప్రజల ప్రయోజనాలను రాష్ట్రాల అవసరాలను గుర్తించి తగిన విధంగా బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ వివక్షతను మానుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా నగర నాయకులు ఎగ్గేని మల్లికార్జున్, ఐతం నాగేష్, పరిమళ గోవర్ధన్ రాజు, నలివెల రవి, అప్పనపురి నర్సయ్య, రాయినేని ఐలయ్య, మాలి ప్రభాకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
Sabitha Indra Reddy | మహేశ్వరం అభివృద్ధికి పైసా ఇవ్వని సీఎం రేవంత్..: మాజీ మంత్రి సబిత
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా