గూడూరు : పంటచేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్తీగ తగిలి మహిళా రైతు మృతి చెందగా కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో చేనుకు చెందిన రైతు చికిత్సపొందుతూ మరణించిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని చిల్లగండితండాలో చోటుచేసుకుంది. సీఐ రాజిరెడ్డి, ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం…తండాకు చెందిన గుగులోత్ భూలి (55) అనే మహిళరైతు ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇదే తండాకు చెందిన గుగులోత్ ఈర్యాఅనే రైతు పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందింది.
కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం భూలి కోసం వెతుకుతుండగా విద్యుత్ తీగలకు తగిలి భూలి చనిపోవడాన్ని గుర్తించారు. కాగా ఆమె మృతికి కారణమంటూ సోమవారం రైతు ఈర్యా(60)పై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేయడంతో స్పృహ కోల్పోయ్యాడు. తండావాసులు గమనించి ఈర్యను స్థానిక సీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగావిద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన గుగులోత్ భూలి కుటుంబ సభ్యులను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సోమవారం రోజు పరామర్శించారు. సంఘటన జరిగిన వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ యోగేష్గౌతం పాల్గొన్నారు.