నా ప్రజలను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరినీ కరోనా నుంచి రక్షించుకుంటాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు.. కరోనా నుంచి బయట పడవచ్చు అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ నుంచి పాలకుర్తి అసెంబ్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులతో మంత్రి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈసందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు.
గత రెండు రోజులుగా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పాలకుర్తి, తొర్రూర్, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర మండలాల్లో జరిపిన 838 కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక భౌతిక దూరం పాటించాలని, గుమికూడి ఉండవద్దని సూచించారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి, 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తిచేయాలని మంత్రి అధికారులను అదేశించారు. మొదటి డోసు తీసుకున్న వారికి రెండవ డోసు వ్యాక్సిన్ ఇప్పించాలని ఎర్రబెల్లి కోరారు. అదే విధంగా 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇప్పించాలని మంత్రి ఆదేశించారు.
కరోనా వచ్చిన వారు అధైర్యపడకుండా కరోనా కిట్లోని మందులను డాక్టర్లు, వైద్య సిబ్బంది సూచనల మేరకు వాడినట్లయితే కరోనా తగ్గుతుందని ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు కరోనా మందులు వాడుతూ ప్రతిరోజు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని, ఇమ్యూనిటీ కొరకు పోషక ఆహారం, డ్రైఫ్రూట్ తీసుకోవాలని సూచించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా సోకిన వారికి సహాయ సహకారాలు అందించడానికి హన్మకొండలో ఇద్దరు సిబ్బందిని, హైదరాబాద్లో మరో ఇద్దరు సిబ్బందిని అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. కరోనా బాధితులను అవసరమైతే ఆసుపత్రికి తరలించడానికి ప్రతి మండలంలో అంబులెన్స్లు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు.