(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రక్షణ రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) ఇంజిన్ తయారీలో భారత్ స్వావలంబనకు కీలక ముందడుగు పడింది. స్వదేశీ పరిజ్ఞానంతో 350 కిలోల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను పరిశోధకులు విజయవంతంగా అభివృద్ధి చేశారు. బెంగళూరులోని డీఆర్డీవోకు అనుబంధంగా పనిచేస్తున్న ‘గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్’ (జీటీఆర్ఈ) ఈ ఇంజిన్ను డిజైన్ చేయగా, హైదరాబాద్కు చెందిన ‘ఆజాద్ ఇంజినీరింగ్’ సంస్థ ఇండస్ట్రీ పార్ట్నర్గా దీనిని నిర్మించి, అసెంబుల్ చేసింది. కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆజాద్ ఇంజినీరింగ్ ప్రతినిధులు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి.. గత నెల 22న ఈ ఇంజిన్ను డీఆర్డీవో ఉన్నతాధికారులకు అందజేయడం విశేషం.
శత్రు దేశాలపై ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, యూఏవీలు, డ్రోన్లు లక్ష్యాలను చేధించాలంటే టర్బో జెట్ పవర్ ఉండాలి. దీనికి థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ అవసరం. అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. దీంతో ఈ సాంకేతికత కోసం మొన్నటివరకూ భారత్ కూడా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే, టర్బోజెట్ ఇంజిన్ తయారీలో భారత్ తాజాగా ఈ ఘనత సాధించడం ఏరోస్పేస్ ప్రొపల్షన్ రంగంలో స్వయం సమృద్ధికి నాందిగా రక్షణరంగ నిపుణులు చెప్తున్నారు.
టర్బో జెట్ ఇంజిన్ డిజైన్ను డీఆర్డీవో శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, ఇంజిన్ తయారీ, అసెంబుల్ను మాత్రం హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ పూర్తి చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ.. బీఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో నగర శివారుల్లో పలు తయారీ యూనిట్లను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్లో గత ఏప్రిల్లో ప్రారంభించిన ఆజాద్ కంపెనీ కొత్త తయారీ యూనిట్కు కేసీఆర్ పాలనలో 2021లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను విజయవంతంగా తయారు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ, డీఆర్డీవో సంయుక్తంగా సాధించిన ఈ ఘనత హైదరాబాద్తో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.

హైదరాబాద్లో తయారైన ఈ టర్బోజెట్ ఇంజిన్ భారతదేశపు స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాలను, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గత పదేండ్లలో ఈ రంగం మరింత బలోపేతం కావడం వల్లే ఇలాంటి చరిత్రాత్మక ఘనత సాధ్యమైందని తెలిపారు. చరిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో శాస్త్రవేత్తలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.