జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే -1వ గనిలో రాత్రి షిఫ్టులో గోపాలం గోపి (కోల్ కట్టర్) అనే కార్మికునికి గుండెపోటు రాగా తోటి కార్మికులు ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గోపి మృతి చెందాడని ఆరోపిస్తూ సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరియా సింగరేణి హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. సింగరేణి కార్మికులు చేస్తున్న ధర్నాకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుని మరణాన్ని మైన్ డెత్ గా పరిగణించాలన్నారు. కార్మికుని కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు అందేలా చూడాలని, కార్మికునీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితల సమ్మయ్య, రత్నం అవినాష్ రెడ్డి, మల్లారెడ్డి తో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.