భూపాలపల్లి : జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవర్థక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఆ శాఖ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కుమారస్వామి జిల్లాలో పాడి పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల అభివృద్ధికి పశుసంవర్థక శాఖ ద్వారా చేస్తున్న పలు కార్యక్రమాలవివరాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంతో పాటు పశుసంపదతో అదనపు ఆదాయం సమకూరుతుందని, జిల్లాలో పశు సంపద అభివృద్ధికి పశుసంవర్థక శాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు.
ప్రజలకు పశు సంపద నిర్వహణపై అవగాహన కల్పించాలని, పశువులకు సంక్రమించే వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్ అందజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్దిదారులందరికీ సబ్సిడీ గొర్రెలు అందేలా చూడాలని, గొర్రెలను తీసుకు వచ్చేందుకు వెళ్లే అబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నపెరటి కోళ్ల పెంపకం పథకానికి జిల్లాలో 90 యూనిట్లు మంజూరై దాదాపు కోటి రూపాయల నిధులు అందుబాటులో ఉన్న ఇప్పటి వరకు లబ్దిదారుల ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీదేవి, పశు వైద్యులు, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.