చిట్యాల, ఫిబ్రవరి 26 : పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కిన్నెర శిరీష – రాజు దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కిన్నెర కీర్తన(7) ఉన్నారు. కాగా, కుటుంబ సమేతంగా ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది.
ఈ క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన అర్ధరాత్రి ఒంటి గంటకు చిట్యాల సివిల్ దవఖానకు తరలించారు. వైద్యుల సూచనల మేరకు భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజిఎం దవఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారూ ముద్దుగా పెంచుకున్న బిడ్డ కండ్లముందే కానరాని లోకానికి వెళ్లడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.