నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 18: నాగిరెడ్డిపేట్ మండలంలో కరోనా పంజా విసురుతున్నది. గతంలో కాస్త తగ్గుముఖం పట్టినా.. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. వేసవి కాలంలోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. 15 రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు.. మరోవైపు నివారణ చర్యలు.. ఇంకోవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. మహమ్మారి మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలని, అప్పుడే ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉన్నదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మండలంలో 2,366 మందికి వ్యాక్సినేషన్..
మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో 45 ఏండ్లు పైబడిన వారు 8,233 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా.. ఆదివారం వరకు 2,366 మందికి టీకా వేసినట్లు నాగిరెడ్డిపేట్ మెడికల్ ఆఫీసర్ నందిత తెలిపారు. నాగిరెడ్డిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టీకా తీసుకునే వారు, నిర్ధారణ పరీక్షలు చేసుకునే వారి రద్దీ పెరుగడంతో టీకా వేసేందుకు సబ్సెంటర్లను ప్రారంభించారు. మండలంలోని బొల్లారం, జాన్కంపల్లి, మాల్తుమ్మెద, నాగిరెడ్డిపేట్ గ్రామాల్లో సబ్సెంటర్లు కొనసాగుతున్నాయి. సంబంధిత గ్రామాల పరిధిలోని ప్రజలు వచ్చి టీకాలు తీసుకోవాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నారు.
మండలవ్యాప్తంగా 126 పాజిటివ్ కేసులు..
మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రం గోపాల్పేట్లోనే 61 కేసులు ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు. వైరస్వ్యాప్తి 15 రోజులుగా తీవ్రంగా ఉన్నదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని పేర్కొంటున్నారు. ప్రజలు నిర్లక్ష్యం వీడాలని, కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని వారు కోరుతున్నారు. ఫంక్షన్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిదని, గుంపులుగా ఉండకూడదని వివరిస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.