న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.404.18 లక్షల కోట్లకు చేరింది. వరుస లాభాల నడుమ గడిచిన 5 రోజుల్లో మదుపరుల సంపద రూ.11.29 లక్షల కోట్లు ఎగిసింది. గురువారం 486.50 పాయింట్లు పుంజుకొని బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 74,339.44 వద్ద స్థిరపడింది. ఐదు రోజుల్లో సూచీ 1,850.45 పాయింట్లు లేదా 2.55 శాతం ఎగబాకడం విశేషం. ఈ క్రమంలోనే మార్కెట్ క్యాప్ రూ.11,29,363.01 కోట్లు అందుకుని రూ.4,04,18,411.32 కోట్లకు వెళ్లింది. ఇదిలావుంటే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 167.95 పాయింట్లు పెరిగి 22,570.35 వద్ద నిలిచింది.