స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి దేశప్రజలకు తలా పదిహేను లక్షలు పంచుతామని చెప్పిన బీజేపీ సర్కార్ ఆ హామీని గాలికి వదిలేసి సుమారు 12 సంవత్సరాలైంది. బయటి దేశాల్లోని నల్లధనం తేవటం అటుంచి, గత పన్నెండేండ్లుగా ఇక్కడి బ్యాంకుల్లోని తెల్లధనాన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ప్రస్తుత 2026 వరకు అచ్చంగా పది లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను ‘రైటాఫ్’ చేసినట్టు స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా లోక్సభకు వెల్లడించింది. విద్య, వైద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలపై పెట్టుబడులకు చేతులు రాని కేంద్రం సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం రైటాఫ్ రూపంలో లక్షల కోట్లు చెల్లించుకుంటుండటం విడ్డూరం.
చిన్న రుణగ్రహీతల నుంచి బకాయిలు ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ఇలా బడాబాబులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం ఏమిటనేది ప్రశ్న. సన్నకారు రైతులు, స్వయం ఉపాధిదారులు, మధ్య తరగతి కుటుంబాలు బ్యాంకు రుణం కట్టలేకపోతే బ్యాంకు అధికారులు నోటీసులు పంపి, ఆస్తుల స్వాధీనం వంటి కఠిన చర్యలను తీసుకుంటారు. వీటివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం అనే సమస్య మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉంటుంది. బ్యాంకు వేల కోట్ల రుణాలు తీసుకున్న కార్పొరేట్ కంపెనీలు ఎగవేసిన రుణాలను రైటాఫ్ పేరిట వదిలేసుకోవటం ఏమిటనేది సామాన్య ప్రజల ప్రశ్న.
అయితే, రైటాఫ్ అంటే పూర్తిగా రుణమాఫీ అని కాదని, కేవలం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి సదరు రుణాలను తొలగిస్తారు. ఇదొక సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని అధికారవర్గాలు ఈ చర్యను సమర్థించుకుంటున్నాయి. రైటాఫ్ చేసినప్పటికీ సదరు రుణాల వసూలు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. కానీ ఆచరణలో రైటాఫ్ చేసిన రుణాల్లో ఎంత శాతం వెనక్కి వచ్చాయో మాత్రం వెల్లడించరు. ఈ రైటాఫ్లు 2018-19లో గరిష్ఠంగా రూ.1,48,753 కోట్లుగా ఉంటే 2025-26 నాటికి కనిష్ఠంగా రూ.20,485 కోట్లుగా నమోదయ్యాయి. ఈ రైటాఫ్స్ వల్ల బ్యాంకులపై పడే భారాన్ని అంతిమంగా నియమబద్ధంగా పన్నులు చెల్లించే పౌరులపైనే రుద్దుతారు. ఇదే విషయాన్ని విమర్శకులు ‘ప్రైవేట్ లాభాలుపబ్లిక్ నష్టాలు’ అని అభివర్ణిస్తుంటారు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులది కీలక పాత్ర. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బీజేపీ సర్కార్ ఎలా నిర్వహిస్తున్నదీ ఈ తతంగం తెలియజేస్తున్నది.
ఈ రుణాల మంజూరు సమయంలో పాటించిన ప్రమాణాలు, బ్యాంకుల బాధ్యత, ప్రభుత్వ పర్యవేక్షణ.. ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఎలాంటి పూచీకత్తులు, ఏయే అంచనాలతో ఈ భారీ రుణాలు ఇచ్చారు? వాటిపై కఠినమైన పర్యవేక్షణ ఎందుకు విఫలమైంది? డిఫాల్ట్లకు బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోవడం ప్రభుత్వ చర్య మీద అనుమానాలను పెంచుతున్నది. ప్రభుత్వం తరచూ ‘బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశాం’, ‘ఎన్పీఏలు తగ్గించాం’ అని చెప్పుకొంటున్నది. కానీ ఈ తగ్గుదలలో భాగంగా ఇంతింత పెద్ద మొత్తంలో రుణాలను రైటాఫ్ చేస్తే, అది నిజమైన పరిష్కారమా లేదా గణాంకాల మాయాజాలమా? అని ఆలోచించాల్సిన విషయం. బ్యాలెన్స్ షీట్లలో సంఖ్యలు మెరుగుపడవచ్చు. కానీ మూల సమస్య అయిన రుణాల వసూలు తక్కుతూ తారుతూ సాగుతుంటే దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదు.
కార్పొరేట్ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి అవసరం అనే పడికట్టు వాదనను ఎవరూ తోసిపుచ్చరు. అయితే, పెట్టుబడులు, ఉపాధి, ఉత్పత్తి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన కార్పొరేట్ నిర్వహణపై ఆధారపడి ఉంటాయని మరువరాదు. అదే సమయంలో ఆర్థిక నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత, సమానత్వం కూడా అంతే ముఖ్యం. బడాబాబులకు సడలింపులు ఇస్తూ, సామాన్యుల గోళ్లూడగొట్టి రుణాలు వసూలు చేయడం సమానత్వం అనిపించుకోదు. దేశంలో కార్పొరేట్లే కాదు, సామాన్య ప్రజలూ ఉన్నారన్న సంగతి మోదీ సర్కార్ గుర్తించాలి. చిన్న రుణగ్రహీతలకూ ఉపశమనం లభించేలా చర్యలు చేపట్టాలి. పెద్ద రుణాల ఎగవేతలపై సమగ్ర విచారణ జరుపాలి. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బ్యాంగింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలి.