కృష్ణకాలనీ, మే 6 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపు కోసం భూపాలపల్లి పట్టణంలోని కారల్మార్క్స్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల్లో సోమవారం ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డికి తన మీద తనకే నమ్మకం లేక దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మీ పథకంలో భాగంగా ఇస్తామన్న తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. పదేండ్లు బీజేపీ అధికారంలో ఉండి కాళేశ్వరానికి జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక సుధీర్కుమార్ను గెలిపించాలని గండ్ర కోరారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.