భోపాల్: మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు. బాధితుల కుమారుడు ఓ మహిళను వేధించిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఊరు విడిచి వెళ్లారని చెప్పారు. అయితే ఈ నెల 17న తిరిగి గ్రామానికి వచ్చారని, దీంతో ఆ మహిళ భర్త మరో తొమ్మిది మందితో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు.
వారిద్దరిని స్తంభానికి కట్టేసి కొట్టారని, చెప్పుల దండ వేసి ఊరేగించారని చెప్పారు. అయితే దంపతుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.