హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగవుతున్న ఆయిల్ పామ్పై బీహార్ ఆసక్తి కనబరచగా బీహార్లో సాగవుతున్న మకానాపై తెలంగాణ ఆసక్తి కనబరిచింది. బీహార్ వ్యవసాయశాఖ మంత్రి విజయ్కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్-తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు. బీహార్లో ఆయిల్ పామ్ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మారెటింగ్ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు పంటల సాగులో పరస్పర సహకారానికి ఆయా రాష్ర్టాల్లో బృందాలు పర్యటించాలని నిర్ణయించారు.