ఖిలావరంగల్ : ప్రతి జిన్నింగ్ మిల్లులో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పత్తిపంట కొనుగోళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఏర్పాటు చేసే హెల్ప్ డెస్కులో వ్యవసాయ మార్కెట్, డీఆర్డీఓ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులను నియమించాలని డీఎంఓను ఆదేశించారు. జిల్లాలో 1,09,700 ఎకరాలలో సాగు అయిన పత్తిపంట దాదాపు 96వేల మెట్రిక్ టన్నులు ఉంటుందన్నారు.
ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, మార్కెట్లకు పత్తి విక్రయాలు చేసేందుకు రైతులు వస్తారన్నారు. ఇందుకు గాను సంబంధిత శాఖల అధికారులు రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తేమ విషయంలో రైతులు సరియైన అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో జిల్లాలో పండే పత్తి పంట మొత్తం అవసరం ఉంటుందన్నారు. నాణ్యమైన పత్తి పంట రైతులకు భవిష్యత్లో మంచి లాభాలు ఉంటాయన్నారు.
ఈ సమావేశంలో డీసీపీ వెంకట లక్ష్మి, అదనపు కలెక్టర్ హరిసింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి, జేడీఏ ఉషాదయాళ్, సీసీఐ ఏడా ప్రవీణ్కుమార్, డీఎంఓ ప్రసాద్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పాల్గొన్నారు.