హనుమకొండ, డిసెంబర్ 17 : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కొన్ని రోజులు సెల్ఫోన్ దూరం పెడితేనే అనుకున్న లక్ష్యాలను సాధించడం సులభమవుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆదర్శ లా కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీస్ శిక్షణ తరగతులను శుక్రవారం కేయూ వైస్ చాన్స్లర్ టీ రమేశ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఇక్కడ సీపీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన యువత రాణించాలనే ఉద్దేశంతో పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్ల నియామకాల్లో అర్హత సాధించిన కాజీపేట్ డివిజన్ పరిధిలోని 350 మంది అభ్యర్థులకు 80రోజుల పాటు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. లక్ష్యసాధన కోసం కఠోర సాధన చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. యువత తమ సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టిపెడితే అనుకున్న ఉద్యోగం సాధించవచ్చన్నారు. సిలబస్పై ఎలాంటి అనుమానాలున్నా తక్షణమే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) సాయిచైతన్య, ఏసీపీ శ్రీనివాస్, కాజీపేట, హసన్పర్తి, మడికొండ, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్లు మహేందర్రెడ్డి, శ్రీధర్ రావు, రవికుమార్, రమేశ్, ఎలతుర్తి సీఐ శ్రీనివాస్, ఆర్ఐ నగేశ్, ఎస్ఐలు నవీత, సురేశ్, ఆదర్శ లా కాలేజ్ కార్యదర్శి విద్యాసాగర్, పీజేఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు.