Joe Biden | త్వరలో దేశాధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వివిధ వస్తువులపై సుంకాలు గణనీయంగా పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం 25 శాతం నుంచి 100 శాతానికి పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్లు, ఇతర వాహనాల్లో వాడే బ్యాటరీలు, బ్యాటరీ విడి భాగాలపై విధించే దిగుమతి సుంకం 7.5 నుంచి 25 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి సెమీ కండక్టర్లపై పన్ను రేటు 25 నుంచి 50 శాతానికి, లిథియం అయాన్ ఈవీ బ్యాటరీపై 7.5 నుంచి 25 శాతానికి పెరుగుతుంది.
జో బైడెన్ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది నుంచి మూడేండ్ల పాటు అమలులో ఉంటుంది. దీనివల్ల చైనా నుంచి 18 బిలియన్ డాలర్ల దిగుమతులపై ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఉత్పత్తుల వాడకం పెంచడానికి జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.