వరంగల్ చౌరస్తా : వరంగల్ గిర్మాజీపేటలోని ముదిరాజ్ కులస్తుల తమ కులదైవమైన పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం రాత్రి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్లి పెద్దమ్మతల్లికి మొక్కులు చెల్లించారు. రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్, వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంతం పూర్తిగా భక్తిభావంతో నిండిపోయింది. ముదిరాజ్ కులస్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. పిల్ల పాపలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రతి యెటా అమ్మవారి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని కులపెద్దలు తెలిపారు.