జనగామ, మే 2(నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీ లు.. 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరోసారి ప్రజలను మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్లకు వచ్చే నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం యశ్వంతపూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అధ్యక్షతన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలైన రూ.2లక్షల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన కరెంటు, రూ.15వేల రైతు భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, పింఛన్లు రూ.4వేలకు పెంపు తదితర అంశాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ నాయకుల అసలు స్వరూపాన్ని ఎండగట్టాలన్నారు. ప్రజలకు చెప్పిన మాటలు, రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అడిగిన ప్రజలను మంత్రులు, ఎమ్మెల్యేలు దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగెస్ హయాంలో కరువుతో వలసలు పోతే తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు వాపస్ వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ది కాదా? అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో 45 రోజుల లాక్డౌన్లో రూపాయి ఆదాయం లేకున్నా అన్ని బిల్లులు ఆపి పంట సీజన్కు ముందే రైతుబంధు డబ్బులు వేశామని, మద్దతు, గిట్టుబాటు ధరకు ధాన్యం కొన్నామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కేవలం 5 ఎకరాల వరకే వేశారని, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.2500, పింఛన్ రూ.4వేలకు పెంచకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన పనులేంటి.. కాంగ్రెస్ చెప్పి చేస్తున్న పనులేంటో గమనించి, అభివృద్ధి చేసిన వారికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.
పదేళ్లలో ఎండిపోని పంటలు, చెరువులు, కుంటలు ఇప్పుడు ఎందుకు ఎండిపోయాయి..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్కు ఓటు వేయాలని పల్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ వచ్చాక నిలిపివేసిందని ఆరోపించారు. ఎండిన పంటలు చూసి రైతును ఓదార్చేందుకు కేసీఆర్ పొలం బాట పడితే ప్రభుత్వం మేల్కొని నాగార్జునసాగర్, కాళేశ్వరం నీటిని విడుదల చేసినా అదనుకు అందక పంటలు ఎండిపోయాయన్నారు. వరంగల్ అంటేనే బీఆర్ఎస్ అని.. ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం చేసి అభివృద్ధ్దికి కృషి చేస్తామన్నారు.
స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్రెడ్డి అంగీలాగును సొంత పార్టీ నాయకులే ఊడ పీకుడు ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారికే ఎంపీ టికెట్లు కేటాయించి మొదటి నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి మొండిచేయి ఇచ్చారన్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోక పోవడాన్ని చూస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థమవుతుందన్నారు.