ఖానాపురం/కొత్తగూడ మే 2 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలోని ఈదులకుంటలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. కూలీలతో కలిసి ఉపాధి పనులు చేశారు. గడ్డపారతో మట్టిని తవ్వి, ఎత్తి ట్రాక్టర్లో పోశారు. కొత్తగూడ మండల కేంద్రంలోని అంగడిసెంటర్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలోనే మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను తమ ఇంటి ఆడబిడ్డ గా ఆదరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ రోడ్షోకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞత లు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు నానా తంటాలు పడుతున్నారని, కనీసం తాగునీటి ఎద్దడిని కూడా నివారించలేక పోయిందన్నారు.
ఉన్న నీటి సౌకర్యాన్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మార్పు పేరుతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గొంతు నొక్కే కుట్రలు చేస్తున్నదన్నారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ను రాష్ట్రంలో 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధించడం అప్రజాస్వామికమన్నారు. సీఎం రేవంత్రెడ్డి పేగులు తీసి మెడలో వేసుకుంటా.. రేగొండ సభలో తుపాకులతో కాల్చేస్తాం.. అన్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. రోడ్షోలతో కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. ఖానాపురంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీవెంకటనర్సయ్య, మౌలానా, కొత్తగూడలో ములుగు జిల్లా చైర్పర్సన్ బడే నాగజ్యోతి, మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు, ఇర్ప సూరయ్య పాల్గొన్నారు.