HomeEditpageWhat Did Ec Do On Complaints Against Pm Modi
PM Modi | మోదీ.. 27 కేసులు, 1 నోటీసు, చర్య సున్నా
2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కనీసం 27 సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
‘మీ విధి నిర్వహణలో మీరు విఫలమయ్యారని నేను ఏప్రిల్ 24న హెచ్చరించాను. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో, వివక్షతో వ్యవహరిస్తున్నదనేది నా ఆరోపణ’
– 2014, మే 8న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ
2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కనీసం 27 సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ కేసుల్లో దేని మీదా ఇప్పటివరకు ఎన్నికల సంఘం నికరమైన చర్య తీసుకోలేదు. ఈ ఫిర్యాదుల్లో విద్వేష ప్రసంగం, ఓట్లు పొందేందుకు సైనిక దళాలను ఉపయోగించుకోవడం, మతం పేరు మీద ఓట్లు అడగడం, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ప్రధాని ఎన్నికల సభల ప్రసంగాల తయారీకి ఉపయోగించుకోవడం మొదలైనవి ఉన్నాయి.
PM Modi | మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం ఏప్రిల్ 25న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన గురించి తెలియజేసే నోటీసులు పంపింది. అయితే ఇక్కడో చిన్న కిటుకు ఉంది. ఆ నోటీసులో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) అందజేసిన ఫిర్యాదుల గురించిన ప్రస్తావన అయితే ఉంది కానీ, ప్రధాని పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఒక ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ మతావేశంతో కూడిన ప్రసంగం చేశారనీ, కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే సంపదను చొరబాటుదారులకు పంచేస్తుందని ఆ ప్రసంగంలో అన్నారని ఆయా రాజకీయపక్షాలు తమ ఫిర్యాదులో ఆరోపించాయి.
‘కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు దేశంలోని సంపదలపై ముస్లింలకే మొదటి హక్కు ఉంటుందని చెప్పారు. అంటే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కనేవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. ఇదంతా మీకు ఆమోదయోగ్యమా?’ అని ప్రధాని రాజస్థాన్లోని బాన్సువాడ జిల్లాలో ఏప్రిల్ 21 ఆదివారం నాడు జరిగిన సభలో సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు.. ‘మన తల్లులు, చెల్లెళ్ల ఒంటిమీద ఉన్న బంగారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, లెక్కవేసి దానిని పంచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంటున్నది. సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉంటుందని మన్మోహన్సింగ్ సర్కార్ ఇదివరకే అన్నది. సోదర, సోదరీమణులారా ఈ అర్బన్ నక్సల్ ఆలోచనలు మీ మెడలో ఉండే మంగళసూత్రాన్ని కూడా వదిలిపెట్టవు, వారు అంతదాకా వెళ్తారు.’
ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని సెక్షన్ (1) ఏమంటుదంటే: ఏ పార్టీ కానీ, అభ్యర్థి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విభేదాలను రెచ్చగొట్టడం లేదా విద్వేషాన్ని సృష్టించడం లేదా వివిధ కులాలు, సామాజికవర్గాలు, మతాలు, భాషావర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు.
బీజేపీని సదరు నోటీసుకు ఏప్రిల్ 29లోగా సమాధానం అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ ప్రసంగం చేసిన బాన్సువాడ నియోజకవర్గంలో రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26 శుక్రవారం నాడు పోలింగ్ జరిగింది.
2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధానిపై అందజేసిన కనీసం 27 ఫిర్యాదులను ‘ది క్వింట్’ విశ్లేషించింది. ఇందులో అంశాలవారీగా చూస్తే… 8 రకాల ఉల్లంఘనలు జరిగినట్టు తెలుస్తున్నది.
విపక్షాలు చెప్పేదాని ప్రకారం ఎన్నికల సంస్థ ఈ ఫిర్యాదుల్లో దేనిమీదా చర్య తీసుకోలేదు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2019 మార్చి 27న ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాసిన ఒక లేఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రకటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు.
‘ప్రధాని తన ప్రసంగంలో డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి, పరీక్షించడాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, అందులోనూ ప్రధాని కూడా ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు ఈ ప్రకటన చేశారు. ఇది స్పష్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే’ అని ఏచూరి తన ఫిర్యాదులో తెలిపారు. ఆ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఒక కమిటీ ప్రభుత్వ మీడియా దుర్వినియోగం అనేది జరగలేదని ఒక్క ముక్కలో తేల్చేసింది. ఎన్నికల సంఘం తన ఫిర్యాదును కొట్టివేయడంపై ఏచూరి స్పందిస్తూ, అధికారిక మీడియా దుర్వినియోగం అనే సంకుచిత పరిధికి కుదించడం ఫిర్యాదుపై సంకుచిత భాష్యం చెప్పడమేనని అన్నారు. ప్రసంగం ముగిసిన వెంటనే ప్రధాని కేవలం భూమి మీద, ఆకాశంలో మాత్రమే కాదు.. అంతరిక్షంలో కూడా నేను చౌకీదారును అని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఎన్నికల సంఘం, మోదీ పాలన: గతేడాది డిసెంబర్లో భారత పార్లమెంటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం (2023)ను ఆమోదించింది. ఆ చట్టంలోని 7వ సెక్షన్ ప్రకారం ప్రధాని చైర్పర్సన్గానూ, కేంద్ర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ఎంపిక కమిటీ సిఫారసు మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు అదివరకే ఆ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత లేదా పార్లమెంటులోని అతిపెద్ద విపక్ష పార్టీ నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. (కానీ కేంద్రం దీనిని పాటించలేదు)
తమ పార్టీ గీతంలోని ‘జై భవాని’, ‘హిందూ’ అనే పదాలను తొలగించాలని ఎన్నికల సంఘం నుంచి తనకు ఏప్రిల్ 21న ఆదేశాలు వచ్చాయని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఆ ఆదేశాలు పాటించేందుకు ఠాక్రే నిరాకరించారు. తమకన్నా ముందుగా కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆంజనేయుని (జై బజరంగ బలీ) తలచుకుని ఈవీఎంను నొక్కాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీపై, రాంలల్లా ఉచిత దర్శనం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్షాపై చర్య తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హనుమంతుని పేరు వాడుకోవడంపై కాంగ్రెస్ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ దీనిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ప్రధానిపై పనౌతీ, పిక్పాకెట్, ధనవంతులకు రుణమాఫీ చేసేవాడనే ఆరోపణలు చేసినందుకు రాహుల్గాంధీకి ఎన్నికల సంఘం 2023 నవంబర్లో నోటీసులు పంపించింది. రాజకీయ ప్రత్యర్థులపై నిర్ధారితం కాని ఆరోపణలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి సూచిస్తున్నదని ఆ నోటీసులో రాహుల్కు గుర్తుచేసింది.
అంతకుముందు మితవాద బజరంగ్దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అలా చేయడాన్ని బజరంగ్ బలీ లేదా హనుమంతుడిని జైలులో పెట్టడంగా పోల్చిచెప్పారు. ఈసీ నోటీసులో చేసిన సూచనలను పాటించేందుకు నిరాకరించే సమయంలో ఠాక్రే ఎత్తిచూపింది దీనినే. ప్రధానిని అవమానించేలా పోస్టులు పెట్టారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కూడా నోటీసులు జారీచేశారు. 2019లో కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఈసీ పేర్కొంటూ, 72 గంటల పాటు ప్రచారం జరపకుండా ఆయనపై నిషేధం విధించింది.
ఎంసీసీ ఓ నైతిక సెన్సార్: ఏప్రిల్ 16 వరకు రాజకీయపార్టీలు నియమావళి పాటించడం అనేది స్థూలంగా సంతృప్తికరంగా ఉన్నదని స్వయంగా ఎన్నికల సంఘమే వెల్లడించింది. సుమారు 200 దాకా రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిలో 169 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని ఒక ప్రకటనలో ఈసీ తెలిపింది. అంశాలవారీగా ఫిర్యాదులను వివరిస్తూ, బీజేపీ నుంచి 51 ఫిర్యాదులు వస్తే 38 ఫిర్యాదులపై, కాంగ్రెస్ నుంచి 59 ఫిర్యాదులు వస్తే అందులో 51 ఫిర్యాదులపై, ఇతర పార్టీల నుంచి 90 ఫిర్యాదులు వస్తే 80 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.
ఏప్రిల్ 25న ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా స్టార్ క్యాంపెయినర్ల ఉల్లంఘనపై బీజేపీకి ఈసీ నోటీసు పంపింది. 2024 ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు ఈసీ జరిపిన పత్రికా సమావేశంలో నేషనల్ హెరాల్డ్కు చెందిన జర్నలిస్టు ఆష్లిన్ మాథ్యూ ఫిర్యాదుల విషయంలో ఎన్నికల సంఘం బీజేపీని ఒకరకంగా, ఇతర పార్టీలను ఒకరకంగా చూడటం గురించి ప్రశ్నించారు. ‘విద్వేష ప్రచారాలపై, కోడ్ ఉల్లంఘనపై లెక్కప్రకారం చర్యలుంటాయని మీరు తెలిపారు. ప్రధానిపై, అమిత్ షాపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఈసీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కానీ, ప్రతిపక్ష నాయకుల మీద మాత్రం చర్యలు తీసుకున్నారు. లెక్కప్రకారం చర్యలు అంటే విపక్ష నేతలపై ఎక్కువ చర్యలుంటాయా లేక బీజేపీ నుంచి ఎక్కువ నోటీసులు అని అర్థమా?’ ఇది మాథ్యూ అడిగిన ప్రశ్న.
సమాధానంగా సీఈసీ రాజీవ్ కుమార్ ఇలా అన్నారు.. ‘గత 10-11 సంవత్సరాల నుంచి వస్తున్న ఫిర్యాదులు చూడండి. ఆ తర్వాత మేం ఇచ్చిన నోటీసులు గమనించండి. పార్టీలు మా నోటీసులకు స్పందించిన తర్వాత, ఉల్లంఘన ఉన్నదని తెలిసినప్పటికీ, ప్రతిసారీ మేం చర్యలు తీసుకోవడం జరగదు. ప్రవర్తనా నియమావళి అనేది ఓ నైతిక సెన్సార్ లాంటిది. కానీ, ఎవరిమీదైనా కేసు ఉంటే మాత్రం మేం చూస్తూ ఊరుకోం. అది ఎంత పెద్ద స్టార్ క్యాంపెయినర్ అయినా సరే వదిలి పెట్టం’.