లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 26,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన ‘పీడీఏ’ వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన విమర్శించారు. (Akhilesh Yadav) ఆదివారం లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. అధికారిక గణాంకాల ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చిన 2017 మార్చి నాటికి ఉత్తరప్రదేశ్లో 1,13,938 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండేవని తెలిపారు. అయితే అప్పటి నుంచి 26,000కు పైగా పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు.
అత్యధికంగా లఖింపూర్ ఖేరీలో 758, సీతాపూర్లో 650, ప్రయాగ్రాజ్లో 638, సీఎం ఆదిత్యనాథ్ సొంత జిల్లా అయిన గోరఖ్పూర్లో కూడా సుమారు 500 ప్రాథమిక స్కూళ్లను మూసివేసినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన ‘పీడీఏ’ వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన మండిపడ్డారు.
కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 2017లో 1.17 కోట్లు ఉండగా, 2026 నాటికి అది సుమారు 89 లక్షలకు తగ్గిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 2017లో సుమారు 4 లక్షల నుంచి ప్రస్తుతం 3.40 లక్షలకు తగ్గిందన్నారు. దాదాపు 81,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఇష్టం లేని కారణంగానే ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను తగ్గిస్తోందని ఆరోపించారు.
మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేత బాలికల విద్యను దెబ్బతీసిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికల సంఖ్య 2017 మార్చిలో 61.57 లక్షల నుంచి ఇప్పుడు సుమారు 45 లక్షలకు పడిపోయిందని చెప్పారు. వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని విమర్శించారు.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో పాఠశాలల మూసివేత, తగ్గుతున్న విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల ఖాళీలు, ప్రాథమిక పాఠశాలల్లోని అధ్వాన్నమైన సౌకర్యాల వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వాన్ని సమాజ్వాదీ పార్టీ నిలదీస్తుందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. విద్యతో పాటు పరీక్షా పత్రాల లీకేజీ, శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలపై కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని ఆయన అన్నారు.