లక్నో: చికిత్స కోసం డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య ఒక బ్రిడ్జి పైనుంచి నదిలోకి దూకింది. సుమారు 40 కిలోమీటర్ల దూరం నీటి ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. అయితే 12 గంటల తర్వాత పడవ నడిపేవారు ఆ మహిళను గమనించి రక్షించారు. (woman jumps into Ganga) ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లోహియా తలాబ్ చోటీ బసాహి ప్రాంతానికి చెందిన సునీతా దేవి తన నలుగురు పిల్లలతో కలిసి అత్త వారింట్లో నివసిస్తున్నది. ఆమె భర్త సూరజ్ గుజరాత్లో పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. తనకు అనారోగ్యంగా ఉన్నదని చెప్పింది. చికిత్స కోసం భర్తను డబ్బు అడిగింది.
కాగా, డబ్బు పంపేందుకు భర్త సూరజ్ నిరాకరించాడు. చికిత్సకు డబ్బు కోసం తన తల్లితో మాట్లాడమని ఆమెకు చెప్పాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన సునీతా దేవి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయింది. శాస్త్రి వంతెన వద్దకు చేరుకుని గంగా నదిలోకి దూకింది. అయితే సునీతా దేవి కోసం ఆమె అత్తింటి వారు, పిల్లలు ఎదురుచూశారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.
మరోవైపు గంగా నదిలోకి దూకిన సునీతా దేవి 12 గంటల పాటు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరునాడు ఉదయం 5 గంటల సమయంలో సుమరు 40 కిలోమీటర్ల దూరంలోని చునార్లో పడవ నడిపే వారికి ఆమె కనిపించింది. దీంతో ఆ మహిళను వారు రక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సునీతా దేవిని పుట్టింటి వారు తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమె నలుగురు పిల్లలు తమ తల్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.