జోగులాంబ గద్వాల : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Government Hospital ) లో నిరుపయోగంగా ఉన్న భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Rizwan Basha Sheikh ) అధికారులను ఆదేశించారు.
గురువారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలు, వైద్య పరికరాలు, సిటీ స్కాన్, ల్యాబొరేటరీ, తదితర పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిటీ స్కాన్ సేవలను సమర్థవంతంగా వినియోగించా లని, ఇన్పేషెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోగుల రద్దీని నియంత్రించేందుకు టోకెన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
రోగులు ఒకేసారి గుమిగూడకుండా టోకెన్ నంబర్ ప్రకారం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట అదనపు కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు అందించే వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అందుబాటులో ఉన్న గదులను వినియోగించుకోవాలని తెలిపారు.
అవసరమైన మేరకు ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, పిల్లల ఆట స్థలం వంటి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి అనుకూలంగా ముఖ్యంగా పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా గోడలపై ఆరోగ్య అవగాహన చిత్రాలు వేయించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, ఆసుపత్రి పర్యవేక్షకులు ఝాన్సీ లక్ష్మి, ఆర్ఎంవో వెంకట దాస్,అధికారులు పాల్గొన్నారు.