ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మరణానికి సంబంధించిన కేసులో తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చడంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. (Uddhav Thackeray) ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్లను కూడా ఎందుకు చేర్చకూడదు? అని ఆయన ప్రశ్నించారు. గురువారం సంభాజీనగర్లో మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. తనకు గానీ, తన కుమారుడికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఆ ఘటన అత్యంత విషాదకరమైనది. కానీ మమ్మల్ని ఇందులో ఎందుకు లాగుతున్నారు? మాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. రేపు మీ పేర్లను కూడా ఇందులో లాగొచ్చు’ అని ఆయన అన్నారు.
కాగా, ఈ కేసుతో సంబంధం లేని వారి పేర్లను కూడా ఎఫ్ఆర్ఐలో చేర్చుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అసలు సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి వారి పేర్లను కూడా ఇందులో చేర్చే అవకాశం ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మీరు ప్రధాని మోదీ, ట్రంప్ పేర్లను కూడా ఇందులో ఎందుకు లాగకూడదు?’ అని ప్రశ్నించారు. సీబీఐ ‘వ్యక్తిత్వ హననానికి’ పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరోవైపు దిశా సాలియన్ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదిత్య ఠాక్రే కూడా స్పష్టం చేశారు. ఆమెను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో తెలియదని చెప్పారు. దిశా మరణంతో తనను ముడిపెట్టడం ‘స్పష్టమైన రాజకీయ, వ్యక్తిగత ఉద్దేశాలు ఉన్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా, ఆధారాలు లేకుండా చేస్తున్న వ్యక్తిత్వ హనన ప్రయత్నం’ అని ఆయన ఆరోపించారు.
కాగా, 2020 జూన్ 8న ముంబైలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడిపోవడంతో దిశా సాలియన్ మరణించారు. ఆరు రోజుల తర్వాత జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఫ్లాట్లో అనుమానాస్పదంగా చనిపోయారు. దిశా సాలియన్ మరణంపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయాలని తాజాగా బాంబే హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
అయితే ఈ కేసును ‘రాజకీయ ప్రేరేపితమైనది’గా చిత్రీకరించడంపై దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ న్యాయ పోరాటానికి దిగారు. ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీస్ పంపారు.