Road Accident : ఆస్ట్రేలియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన మహిళలుగా అధికారులు గుర్తించారు. విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (VDCA) మాజీ సంయుక్త కార్యదర్శి జీటీ ప్రసాద్ ఇటీవల తన భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఒక కుటుంబ వేడుకలో పాల్గొనేందుకు వారు మెల్బోర్న్ చేరుకున్నారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో జీటీ ప్రసాద్ భార్యతోపాటు ఆయన కోడలు నేహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదం జీటీ ప్రసాద్ కళ్లెదుటే జరిగింది. ఈ ఘటనతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేడుక కోసం ఎంతో ఆనందంగా వెళ్లిన ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది.
మృతదేహాలను స్వస్థలానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 10 రోజుల్లో విశాఖకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు.