Telangana | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటి ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని పరిశ్రమలకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని జీడిమెట్ల, బాలానగర్, మౌలాలీ, మల్లాపూర్, చర్లపల్లి, నాచారం తదితర పారిశ్రామిక వాడలకు గోదావరి, కృష్ణా జలాలను పైప్లైన్ల ద్వారా సరఫరా చేశారు. అలాగే శివార్లలోని పలు పారిశ్రామిక వాడలకూ పైప్లైన్లను విస్తరించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని ఆయా జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా పారిశ్రామిక అవసరాలకూ సరిపోయేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రియల్ క్లస్టర్లకు నీటి సరఫరాపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కాళేశ్వరం నుంచి నీటి తరలింపును నిలిపి వేయడంతో పరిశ్రమలకు నీటి కష్టాలు తప్పడం లేదు. అంతేకాదు కొత్తగా అభివృద్ధి చేసిన ఇండస్ట్రియల్ పార్క్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా రాష్ట్ర సర్కారు దృష్టి సారించడం లేదు. సుల్తాన్పూర్, భువనగిరి, కాలకల్, వర్గల్, ములుగు, చౌటుప్పల్ తదితర పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నా అక్కడ నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో పరిశ్రమల నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
గత పదేండ్లలో 28,000 ఎకరాల్లో 55 కొత్త పారిశ్రామిక వాడలను అప్పటి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు వచ్చే ఐదేండ్లలో 30,000 ఎకరాల్లో 72 ఇండస్ట్రియల్ పార్క్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికల్నీ సిద్ధం చేసింది. నిజానికి అంతకుముందు 40 ఏండ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కలిసి 26,000 ఎకరాల్లో 109 పారిశ్రామిక వాడలనే ఏర్పాటు చేయగలిగాయి. కానీ కేసీఆర్ సర్కారు.. టీఎస్ ఐపాస్ వంటి సరళీకృత సింగిల్ విండో అనుమతుల విధానాన్ని తేవడంతో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఫలితంగా ఇప్పటి ప్రభుత్వ తీరు సర్వత్రా విమర్శలపాలవుతున్నది. చేసేదేమీలేక వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తున్నదని, ట్యాంకర్లు సైతం సమయానికి అందుబాటులో ఉండడం లేదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాయి.