న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. రాయ్బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అదేవిధంగా అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మను (Kishori Lal Sharma) రంగంలోకి దించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా జాబితాను విడుదల చేసింది. ఈ రెండు స్థానాల్లో నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు మరో స్థానంలో బరిలో నిలుస్తున్నారు. అయితే రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఈసారికి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా, నేడు రాహుల్ గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Congress releases another list of candidates for the upcoming #LokSabhaElections2024
Rahul Gandhi to contest from Raebareli and Kishori Lal Sharma from Amethi. pic.twitter.com/2w4QQcn9ok
— ANI (@ANI) May 3, 2024
రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ను ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ మాజీ ఎంఎల్సీ అయిన ఆయన దేశ ప్రజలకు అంతగా తెలియక పోయినా యూపీ ప్రజలకు చిరపరిచితుడే. ఆయన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి అభ్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదేనంటూ దినేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమేథీలో అమలు చేసిన వ్యూహాన్నే రాయ్బరేలీలో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నది.