వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన్ని జిల్లా మెజిస్ట్రేట్ నందికొండ నర్సింగ్రావు, జిల్లా కలెక్టర్ బి.గోపి ప్రారంభించారు. సోమవారం వరంగల్ ఎంజీఎం ఆవరణలో సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వృద్ధాప్యంతో బాధపడుతున్న వారికి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా వైద్యసేవలను అందుబాటులో ఉంచడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఓపీ సేవల విభాగాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ విభాగంలోనే ఓపీ నమోదు చేసుకోవడంతో పాటుగా వైద్యపరీక్షలు నిర్వహించడం పూర్తయిన తరువాత మందులు సైతం ప్రత్యేక కౌంటర్ ద్వారా అందిస్తారని పేర్కొన్నారు.
అనంతరం వృద్ధులకు ఆరోగ్య చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ రూపొందించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.వి.మహేశ్నాథ్ , ఎంజీఎం ఆర్ఎంవో కృష్ణకాంత్, పలువురు విభాగాధిపతులు, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.