హనుమకొండ, డిసెంబర్ 23 : తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ట్రాన్స్కో) భూముల కబ్జాకు అడ్డుకట్ట పడింది. ట్రాన్స్కో ప్రాంతీయ కార్యాలయ ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ‘కరెంటోళ్ల భూములపై కన్ను’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో గురువారం వచ్చిన కథనంతో అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. అధికారిక పర్యటనలో భాగంగా భూపాలపల్లికి వచ్చిన ట్రాన్స్కో సీఎండీ డీ ప్రభాకర్రావు వరంగల్లోని ట్రాన్స్కో అధికారులకు ఈ విషయంపై వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ కో భూముల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ కమిషనర్, హనుమకొండ కలెక్టర్తోనూ ఈ విషయంపై సీఎండీ ప్రభాకర్రావు మాట్లాడారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ట్రాన్స్కో ప్రహరీ నిర్మాణ పనుల వద్ద హనుమకొండ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. హనుమకొండ ఆర్డీవో, తహసీల్దార్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఎస్ఈ బీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రహరీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ట్రాన్స్కో భూముల కబ్జా ప్రయత్నాలను ఆదిలోనే ఆడ్డుకున్నామని ఈ సంస్థ ఎస్ఈ బీ శ్రీనివాసులు తెలిపారు. ‘220/132/33 కేయూ సబ్ స్టేషన్ భూమిలోని కొంత భాగాన్ని చదును చేసినట్లు ఈ నెల 9న గుర్తించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులకు, ట్రాన్స్కో విజిలెన్స్ విభాగాలకు తెలియజేశామని పేర్కొన్నారు. తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా హనుమకొండ-ములుగు రహదారి వైపు కందకం తవ్వించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారులు 220/132/33 కేయూ సబ్ స్టేషన్, ట్రాన్స్కోకు సంబంధించిన భూమిని సర్వే చేశారు. ట్రాన్స్కో భూమిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి చట్టబద్ధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.