సుబేదారి, డిసెంబర్ 15 : లాయర్ వద్ద పనిచేస్తున్న ఓ గుమస్తా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ ముఠాను తయారుచేసుకున్నాడు. తను పనిచేసే లాయర్ వద్దకు వివిధ కేసుల్లో నిందితులు బెయిల్ కోసం రావడం అదునుగా భావించాడు. వారికి కోర్టు బెయిల్ ఇప్పించడానికి ముఠా సభ్యులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, పంచాయతీ కార్యదర్శుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు సృష్టించాడు. బెయిల్ కోసం సులువుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి, నిందితులకు కోర్టు బెయిల్ ఇప్పించాడు. అతగాడి పాపం పండింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.ఈ నకిలీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న లాయర్ గుమస్తా కాకుండా ఈముఠాలో ఉన్న ఐదుగురి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, మూడు సెల్ఫోన్లు, రూ.మూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి గురువారం అరెస్టు వివరాలను వెల్లండిచారు. సీపీ కథనం ప్రకారం.. కాజీపేట సోమిడికి చెందిన రాజశేఖర్ వరంగల్ నగరంలో ఓ లాయర్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు.వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కోర్టు బెయిల్ కోసం లాయర్ వద్దకు వస్తుండేవారు.
ఈక్రమంలో నిందితులకు బెయిల్ ఇప్పించడానికి రాజశేఖర్ అవసరమైన పత్రాలు, పూచికత్తు, సంతకాలను సులభంగా సృష్టించడానికి పథక రచనచేశాడు. ఐనవోలు మండలం పంథినికి చెందిన ఉడతల రవీందర్, గీసుగొండ మండలం ఎల్కుర్తికి చెందిన మండ ప్రభాకర్, దుగ్గొండి మండలం తొగర్రాయికి చెందిన హన్మకొండ బాబు, అడవిరంగాపురానికి చెందిన గుండా సారంగపాణి, ధర్మసాగర్కు చెందిన రమేశ్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని వివిధ గ్రామ పంచాయతీలు, పంచాయతీ కార్యదర్శుల పేర్లతో హైదరాబాద్లో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారుచేశారు. ముఠా సభ్యులు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి కోర్టు బెయిల్ ఇప్పించడానికి గ్రామపంచాయతీ కార్యదర్శుల పేరుతో ఇంటి విలువ, ఇంటి పన్ను చెల్లించినట్లు ఫోర్జరీ పత్రాలు తయారు చేసి రాజశేఖర్కు అందజేసేవారు. రాజశేఖర్ నుంచి నిందితులు నకిలీ పత్రాలు తీసుకుని కోర్టు బెయిల్ కోసం, పూచికత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్ కార్డులతో, పూచికత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేవారు. గురువారం సుబేదారి పోలీసులు సుబేదారిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ పత్రాలతో ఉడుతల రవీందర్ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా ఈ నకిలీ వ్యవహారం బయటపడింది. ఈ ముఠా ద్వారా నకిలీ పత్రాలతో బెయిల్ తీసుకున్న నిందితులు ఎవరెవరు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, సీఐలు సంతోష్, శ్రీనివాస్జీ, రాఘవేందర్, ఎస్సై పున్నం చందర్, సిబ్బందిని సీపీ అభినందించారు.