హనుమకొండ, మే 17: పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించేలా కృషిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాలకుర్తి నియోజకవర్గంలో దేవాదులు, ఎస్సారెస్పీ నీటివినియోగం, కాల్వలు, రిజర్వాయర్లు, భూసేకరణ, లైనింగ్ తదితర అంశాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. నవాబ్పేట రిజర్వాయర్, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్లను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జఫర్గఢ్, పాలకుర్తి చెరువులను రిజర్వాయర్లుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, మండలాల్లో ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందన్నారు.
ఈ ఎండాకాలంలోనే ఆయా గ్రామాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూసేకరణ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, కాల్వలు క్లియర్ చేసి అలైన్మెంట్ సరిచేయాలని, శాశ్వత ప్రాతిపదికన చెరువులు నింపేలా పనులు పూర్తి చేయాలన్నారు. కెనాల్స్ క్రాసింగ్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్లను వెంటనే షిఫ్ట్ చేయాలని, ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ఇంజినీరింగ్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నింపేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, కాంట్రాక్టర్లు పనుల్లో అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. రెండు నెలల్లో చెరువుల్లోకి నీళ్లు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఈఎన్సీ సీహెచ్ మురళీధర్రావు, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, శశాంక, శివలింగయ్య పాల్గొన్నారు.