హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయులకు 50.54% ఫిట్మెంట్తో జూలై 2023 నుంచి వేతన సవరణ చేయాలని పీఆర్సీ కమిటీని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘం సభ్యులు పీఆర్సీ కమిటీని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జనవరి 1 నాటికి ఉన్న డీఏ 33.67 శాతం కలుపుకొని 50.54 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని కోరారు. కనీస వేతనం రూ.35,000 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వార్షిక వేతన వృద్ధి రేటు 3 శాతం నుంచి 3.5 శాతంగా ఉండాలని కమిటీ దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం ఉన్న మాస్టర్ స్కేల్ను కొనసాగించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ క్యాడర్ ఉపాధ్యాయ వేతన వ్యత్యాసం 1:1.363 నుంచి 1:1.15గా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో పని చేస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనలు పంపుతూ.. మినిమం టైం స్కేల్ను ప్రకటించాలని కోరారు.
ఏఏఎస్ నుంచి 6, 12, 18, 24 కాకుండా 4, 8, 12, 16గా ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఆర్ఏ స్లాబ్లు 30 శాతం, 25 శాతం, 20 శాతంగా మార్చాలని చెప్పారు. ఉద్యోగి చనిపోతే అంత్యక్రియల ఖర్చులు రూ.50 వేలకు పెంచాలని కోరారు. సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, రాష్ట్రకోర్ కమిటీ సభ్యులు పాలేటీ వెంకట్రావ్, సూరం విష్ణు వర్ధన్రెడ్డి, భాస్కర్దేశ్ తదితరులు పాల్గొన్నారు.