కామారెడ్డి, మే 9: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తా వద్ద గురువారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు.
దీంతో తీసుకొచ్చిన వడ్లు మార్కెట్ యార్డులోనే ఉండిపోయాయని, బుధవారం కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందన్నారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. అధికారులు వచ్చి ధాన్యం సకాలంలో కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.