హనుమకొండ, డిసెంబర్ 16 : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని బ్యాంకర్లు డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్బీయూ) నిర్ణయం మేరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మొదటి రోజు గురువారం యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో హనుమకొండ అశోకా జంక్షన్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హనుమకొండ శాఖ వద్ద వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు బ్యాంకుల ప్రైవేటీకరణను వెంటనే ఉప సంహరించుకోవాలిన డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు పట్టుకుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మొదటి రోజు సమ్మెలో హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డీజీఎస్ హెచ్ శంకర్, వై ప్రవీణ్కుమార్, కిరణ్కుమార్, అనిల్, శ్రావణ్, యూనియన్ బ్యాంక్ నుంచి దిలీప్, రవి, శశిధర్, కెనరా బ్యాంక్ నుంచి ఖుర్షీద్, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి సుబ్బారావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి సంతోష్, రాజేందర్సింగ్, ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ నుంచి ప్రేమ్కుమార్, ఎస్బీఐ ఆఫీసర్స్ వరంగల్ రీజినల్ సెక్రటరీ జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.