Calcutta High Court | కోల్కతా, మే 20: ఎన్నికల సంఘం తీరును కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా మీడియాలో బీజేపీ ప్రకటనల ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఈసీ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీఎంసీని అప్రతిష్ఠ పాల్జేసేలా బీజేపీ ప్రకటనలకు సంబంధించి తృణమూల్ నేతల ఫిర్యాదులపై సకాలంలో ఈసీ తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. టీఎంసీకి వ్యతిరేకంగా ఎలాంటి అవమానకరమైన ప్రకటనలు ఇవ్వకుండా బీజేపీని నిషేధించడంతో పాటు ప్రకటనలను ప్రచారం చేయకుండా మీడియా సంస్థలను నియంత్రిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిర్యాదుల పరిష్కారంపై హైకోర్టు ఈ సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. టీఎంసీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు, ప్రకటనలు అప్రతిష్ఠ పాల్జేసేవని, ప్రత్యర్థులను అవమానించే ఉద్దేశంతో కూడుకొన్నవని, వ్యక్తిగత దాడుల వంటివని పేర్కొన్నది. సైలెన్స్ పీరియడ్లో(ప్రచారం ముగిసిన తర్వాతి సమయం), పోలింగ్కు ఒకరోజు ముందు బీజేపీ ఇచ్చిన ప్రకటనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇది టీఎంసీ హక్కులను, పారదర్శక ఎన్నికలకు సంబంధించి ప్రజల హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. తమ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పలు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై ఇన్జంక్షన్ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది.