భువనేశ్వర్, మే 20: తాను మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా ఇప్పుడు, ఎప్పుడూ పనిచేయదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏ ఒక్కరినీ ‘ప్రత్యేక పౌరులు’గా అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని, అందరినీ సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్, నెహ్రూ సహా భారత రాజ్యాంగ నిర్మాతలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూదని నిర్ణయించారని మోదీ అన్నారు. అయితే నేడు కాంగ్రెస్ సహా విపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, దాన్ని ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ అతిపెద్దపార్టీగా అవతరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని మరోసారి చెప్పారు. ఎన్నికల ఫలితాలపై స్టాక్ మార్కెట్లో నెలకొన్న భయాందోళనపై మోదీ స్పందించారు. జూన్ 4న భారత స్టాక్ మార్కెట్లు గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయన్నారు. ఆ వారమంతా స్టాక్ మార్కెట్ ప్రోగ్రామర్లు పనితో అలసి పోతారని చెప్పారు.
మోదీ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. సీపీఐ నేత డీ రాజా స్పందిస్తూ ‘మహిళల మెడలో మంగళసూత్రాల గురించి, ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ.. ఎవరు మాట్లాడారు?’ అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటు అని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ విమర్శించారు.