హైదరాబాద్, మే 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలోని సాగుభూముల్లో ఏండ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలు పెద్దయెత్తున నరికివేతకు గురవుతున్నాయి. గడిచిన మూడేండ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు వెల్లడించింది. వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్దయెత్తున నరికేసినట్టు అధ్యయనం పేర్కొంది. దీంతో పక్షులు, చిన్న జీవులు ఆవాసాలను కోల్పోవడమే కాకుండా.. జీవవైవిధ్యం దెబ్బతింటున్నట్టు పేర్కొంది.
సాగు భూముల్లో భారీ వృక్షాల నరికివేత తెలంగాణలోనూ జరిగినట్టు అధ్యయనం వెల్లడించింది. అయితే, తెలంగాణను ధాన్యాగారంగా మార్చడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సాగును ప్రోత్సహించడమే మార్గమని భావించింది. ఈ క్రమంలో వ్యవసాయానికి తగినంత నీరు, 24 గంటల కరెంటు సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. 2014-15లో యాసంగి, వానకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు (60% పెరుగుదల) పెరిగింది. సాగు భూముల్లో నరికివేతకు గురైన వృక్షాల వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని భావించిన కేసీఆర్ సర్కారు.. ‘హరితహారం’ పథకం కింద తొమ్మిదేండ్లలో ఏకంగా 283.71కోట్ల మొక్కలను నాటింది.