బంజారాహిల్స్, అక్టోబర్ 15: ‘ఇక మొదలెడదామా..’ అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత రాకముందే.. బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల శంఖారావం పూరించింది. యూసుఫ్గూడ డివిజన్లోని శ్రీ కృష్ణానగర్ ఏ-బ్లాక్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శ్రీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాగంటి గోపీనాథ్ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్ఎన్నగర్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు మహిళలే అండదండ..
బీఆర్ఎస్ పార్టీకి మహిళలే అండదండ అని మాగంటి గోపీనాథ్ అన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ భాగం మహిళలకే ప్రయోజనం కలిగించాయన్నారు. మహిళల గుండెల్లో సీఎం కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో సైతం మహిళలకు పెద్దపీట వేశారని, అర్హులైన వారికి సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలందరూ బీఆర్ఎస్కు ఓటువేసి ఘన విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.