Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క జాబ్ నోటిఫికేషన్ రాలేదని హరీశ్రావు అన్నారు. మెగా డీఎస్సీ లేదని.. మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్లను మీ ఖాతాలో వేసుకున్నారని.. అన్నీ వండాక వడ్డించి అంతా మీ ఘనత అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నూరు అబద్దాలు చెప్పి గద్దెనెక్కు అన్నదే కాంగ్రెస్ రాజకీయమని ఎద్దేవా చేశారు.
పాలేందో నీళ్లేందో తేలిపోయింది. వద్దురా ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారని హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. వడ్లకు బోనస్ కాదు కదా అసలు వడ్లే కొనడం లేదని.. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం రివర్స్ గేర్లో వెళ్తోందని విమర్శించారు. మంచి నీళ్లు రావడం లేదు.. కరెంటు లేదు.. పథకాలు బంద్ అయ్యాయని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు కరెంటుకు ఇబ్బంది లేదని.. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయని అన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండు పేపర్ రాసిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. వడ్లకు బోనస్ బోగస్.. రైతుభరోసా రాలేదు. మహిళలకు 2500 రాలేదు.. అవ్వాతాతలకు 4 వేల పింఛన్ రాలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు.. ఒక్క ఉచిత బస్సు తప్ప అన్నీ తుస్ అని అన్నారు. నిరుద్యోగులకు 4 వేల భృతి ఇస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. అసలు ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పిందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ తిట్లు, దేవుళ్లపై ఒట్లు అన్నట్టుగా సాగుతుందని హరీశ్రావు అన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను ఆగస్ట్ 15 లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశాను.. రేవంత్ రెడ్డి దీన్ని స్వీకరించకుండా తోక ముడిచారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, డీఎస్సీ, జాబ్ క్యాలండర్ ఎగ్గొట్టడంపై తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉగులు ప్రశ్నించే గొంతుక, గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
రేవంత్ రెడ్డి జిల్లాలను, మండలాలను రద్దు చేస్తామంటున్నాడని హరీశ్రావు అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్పై కోపంతో బీజేపీకి ఓటువేయొద్దని విజ్ఞప్తిచేశారు. పదేళ్ల బీజేపీ పాలనతో దేశంలో నిరుద్యోగం పెరిగిందని.. అదానీ, అంబానీ ప్రపంచ కుబేరులయ్యారని తెలిపారు. బీజేపీ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. మనం మేల్కొని కొట్లాడకపోతే రిజర్వేషన్లు పోతాయని అన్నారు. రాకేశ్ రెడ్డిని గెలిపించి నిజమైన మార్పు తీసుకురావాలని కోరారు.