హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12 : నలుగురు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ఫోర్స్, రాయపర్తి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు రూ.6లక్షల 40వేల విలువైన 64 కిలోల గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ సీతారాం కాలే, లక్షస్ సీతారాం, రాహుల మనోహర్, సౌరబ్ సంజయ్ కాలేగా పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన పవిత్ర పరారీలో ఉన్నాడు. పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వివరాలను వెల్లడించారు. ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పూణె ప్రాంతానికి తీసుకుకొచ్చి ఎక్కువ ధర కు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా పరారీలో ఉన్న నిందితుడు పవిత్ర ద్వారా గంజాయిని కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులు లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా రహస్యంగా తరలించడం ప్రారంభించారు. ఈక్రమంలో గంజాయితో ఉన్న సూట్కేసులతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా రాజమండ్రి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మీదుగా రాయపర్తి బస్టాండ్కు చేరుకున్న నిందితులు మహారాష్ట్ర వెళ్లేందుకు మరో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు రాయపర్తి పోలీసుల సహకారంతో ఆదివారం ఉదయం స్మగ్లర్లను రాయపర్తి బస్టాండ్లో అదుపులోకి తీసుకున్నారు. సూట్కేసులలో గంజాయిని గుర్తించి పోలీసులు నిందితులను రాయపర్తి పోలీస్స్టేషన్కు తరలించారు. విచారించగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంతోష్, వర్ధన్నపేట ఇన్స్పెక్టర్ సదన్కుమార్, టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్లు లవణ్కుమార్, రవళి, హెడ్ కానిస్టేబుల్ సోమలింగం కానిస్టేబుళ్లు రాజేశ్, రాజు, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, అలీ, హోంగార్డు విజయ్ను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.