వనపర్తి: నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి. వీటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక యువతి, ఒక యువకుడి మృతదేహాలు జలాశయంలో ఉండటం స్థానికులు గుర్తించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు.. మృతదేహాలను బయటకు తీశారు. ఒక యువతి, ఒక వివాహితుడి మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. గురువారం నాడు వీళ్లిద్దరూ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో నరేశ్ (25), కల్యాణి (17) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు నరేశ్.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వాడని గుర్తించడం జరిగింది. కల్యాణిది కల్వకుర్తి. నరేశ్కు ఆరేళ్ల కిందటే వివాహమైంది. అతనికి 6 నెలల పాప కూడా ఉంది. అయినా వీళ్లిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకొని, ఆత్మహత్య చేసుకున్నారు.